వాన్పిక్ ల్యాండ్స్ వెనక్కి, బాబు ఏజ్ చూడాలని రావెల
హైదరాబాద్: వాన్పిక్ భూములను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం జరిగింది. ఈ భేటీలో.. అవినీతి నిర్మూలకు చేపట్టాల్సిన చర్యల పైన చర్చించారు.
లేపాక్షి, వాన్పిక్ భూముల అంశంపై చర్చించారు. ఆ భూములను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం సిమెంట్ ధరల పెరుగుదల పైన అధికారులతో సమీక్ష జరిపారు. 11న ఫ్యాక్జరీల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు.
వయస్సు చూడండి: రావెల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఆయన వయస్సుకైనా గౌరవమిచ్చి, దానిని దృష్టిలో పెట్టుకొని అయినా మాట్లాడాలని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు హితవు పలికారు.
హైదరాబాదులో చంద్రబాబు వేసిన పునాదుల వల్లే ఈ రోజు నిలబడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన చర్చించేందుకు సిద్ధమన్నారు. సుప్రీం కోర్టులో ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన పోరాడేందుకు తమ అడ్వోకేట్ జనరల్ సిద్ధమవుతున్నారన్నారు. ఈ విషయమై ప్రధాని, రాష్ట్రపతిలకు లేఖ రాస్తామని చెప్పారు.
సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్
ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరింది. సుప్రీం మార్గదర్శకాల మేరకు తాము నడుచుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఈ సందర్భంగా చెప్పారు. రెండు రాష్ట్రాలు సహకరించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టును కోరామన్నారు.