కష్టాలున్నాయి, మగవాళ్లకి వితంతు పింఛన్లా: బాబు
విజయవాడ: యూపీఏ ప్రభుత్వం హేతబద్ధత లేకుండా విభజన చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టాలు ఉన్నాయని, ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, విజయవాడ ప్రాంతమే రాజధానిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అన్నారు. విజయవాడలో చంద్రబాబు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. రూ.2లకే 20 లీటర్ల తాగునీటిని పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
పేద ప్రజల కోరికను తీర్చాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం పింఛన్లు పెంచుతోందన్నారు. పింఛన్లకు ఎన్టీఆర్ భరోసా అనే పేరు పెట్టినట్లు చెప్పారు. ఎవరికైతే పింఛన్లు ఇస్తామో వారి పేర్లను ఇంటర్ నెట్లో పెడతామన్నారు. ఎవరైనా అర్హులై ఉండి పించన్లు రాకుంటే తన దృష్టికి తేవచ్చునని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పింఛన్లలో అక్రమాలు జరిగాయన్నారు. మగవారికి కూడా వితంతు పింఛన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు. రూ.200 పింఛన్ రూ.1000కి పెంచిన ఘనత తమదే అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. విజయవాడే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చేందుకు ఇప్పుడు డబ్బులు లేకున్నప్పటికీ.. నాకు పట్టుదల ఉందన్నారు. తాను ఎవ్వర్నీ వదిలి పెట్టనని, పేదవాళ్లకు, వృద్ధులకు అందరికీ న్యాయం చేస్తామన్నారు.
ఇప్పుడు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ప్రతి రైతుకు రూ.లక్షా యాభై వేలు రుణమాఫీ చేస్తామన్నారు. 22వ తేదీన రైతులకు 20 శాతం ఇస్తామని చెప్పారు. రైతుల కోసం సాధికారక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రైతుల వద్ద బలవంతంగా అప్పు తీర్చమని అడగకుండా రీషెడ్యూల్ చేయాలని బ్యాంకులను కోరామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. కేంద్రానికి మన పైన అభిమానముందని, అయితే, ఏపీ ఒక్క రాష్ట్రానికి ఇస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతాయని, అందుకే ముందుకు రాలేదన్నారు. పొలం పిలుస్తోంది పథకం ద్వారా ప్రతి రైతు లబ్ధి పొందాలన్నారు.