ట్విస్ట్: రాజధానికి ఎన్టీఆర్ పేరు, బాబు వాయిదావెనుక..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయం దాదాపు ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు మరో అంశం తెర పైకి వచ్చింది. కొత్తగా నిర్మాణమయ్యే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరుతామని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.
ఎన్టీఆర్ పేరు పెడితే రాజధాని ఏర్పాటుకు ఎంత స్థలం కావాలన్నా ఇచ్చేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చేందుకు గుంటూరు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మంచి ముహూర్తం కోసమే రాజధాని ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండికి వాయిదా వేశారని తెలిపారు.
సత్కార్యం చేపట్టే ముందు ముహూర్తబలం మంచిగా ఉండాలన్నదే తమ ఆలోచన అన్నారు. సభాముఖంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. మంగళగిరి వద్ద రాజధాని నిర్మించాలని ఆంధ్రా సర్కారు భావిస్తుండడం తెలిసిందే.
మరోవైపు కొత్త రాజధానికి ఎన్టీఆర్ గ్రీన్ సిటీ అనే పేరు పెడితే బాగుంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పేరును నిర్ణయించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, రాజధాని పైన చంద్రబాబు మంగళవారం ప్రకటన చేస్తారని చెప్పినప్పటికీ అది ఎల్లుండికి వాయిదా పడిన విషయం తెలిసిందే.