రాజధానిపై కమిటీకి ప్రభుత్వం అభిప్రాయం, గుంటూరేనా
హైదరాబాద్: రాజధాని పైన ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ మంగళవారం భేటీ అయ్యారు. రాజధాని ఏర్పాటు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని ఆయన శివరామకృష్ణన్ కమిటీకి ఈ రోజు తెలియజేశారు.
ఏపీ ప్రభుత్వం గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. నారాయణతో పాటు ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కమిటీతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ త్వరలో కేంద్రానికి నివేదిక అందించనుంది.
కాగా, అంతకుముందు రోజు (సోమవారం) నారాయణ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాట్లాడారు. నూతన రాజధాని ఎంపికకు సంబంధించి శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆగస్టు 15లోపు వస్తుందని తెలిపారు. తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజధాని సలహా కమిటీ సింగపూర్, మలేషియా, చైనా, దుబాయ్, చండీఘడ్, గాంధీనగర్ ప్రాంతాలలోని రాజధానులను పరిశీలించి నూతన రాజధానిపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. కృష్ణ, గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయన్నారు. 22న ఢిల్లీలో శివరామకృష్ణ కమిటీతో సమావేశమై రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరచిన విషయాలపై చర్చిస్తానని పేర్కొన్నారు.