రాజధానికి రూ.1.40 లక్షల కోట్లు! జగన్ ఫోన్ చేస్తే నో..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి చెప్పినట్లుగా సమాచారం. రాజధానిలో ఎక్కడెక్కడ ఏమేం ఉండాలో నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని కమిటీ ఈ మేరకు రెండు పేజీల క్లుపత్మైన నివేదికను రూపొందించిందని సమాచారం.
ఈ నివేదికలో దేనికి ఎంత ఖర్చు అవుతుంది? అన్న అంశాలను పొందుపర్చిందట. మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చు అవుతుంది? శాసన సభ, శాసన మండలి, హైకోర్టు, సచివాలయం, ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుంది? రహదారులు, ఉద్యానవనాలు, డ్రైనేజీ, తాగునీరు తదితరాలకు ఎంత ఖర్చవుతుందో ఇందులో పొందుపర్చారు.
26వ తేదీన ప్రభుత్వానికి సమర్పించే ప్రాథమిక నివేదికలో శివరామకృష్ణన్ కమిటీ కూడా ఈ వివరాలను ప్రస్తావించే అవకాశముంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసనలకు సీపీఐ దూరం
రైతు రుణమాఫీ అమలు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేపట్టదలిచిన నిరసనలకు దూరంగా ఉంటామని సీపీఐ చెప్పింది. ఈ కార్యక్రమాలకు సహకరించాలని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణలకు జగన్ ఫోన్ చేశారు. అయితే, సీపీఐ నో చెప్పిందట.