సీఎంలకు తెలుగువాడిగా వెంకయ్య సలహా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, దానిపై కేంద్రం జోక్యం చేసుకోబోదని, తన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దబోదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంగా కేంద్రం ఏమైనా హామీలు ఇచ్చి ఉంటే వాటిని తప్పక అమలు చేస్తుందని, రుణమాఫీ అంశంలో అన్ని రాష్ట్రాలకూ చేస్తున్న న్యాయమే ఏపీ, తెలంగాణకు చేస్తుందన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై స్పందిస్తూ... విద్యార్థులందరికీ సమాన అవకాశాలు లభించాలని, అది రాజ్యాంగస్ఫూర్తి అన్నారు. చదువుకునే చోట వివక్షను ఎదుర్కొనే పరిస్థితి ఉండకూడదన్నారు. ఒత్తిడికి లొంగడం మోడీ సర్కార్ నిఘంటువులోనే లేదని, అలాంటి అపార్థాలుంటే తొలగించుకోవాలని ఉద్యోగుల విభజనపై ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలాంటి విషయాల్లో రెండు రాష్ట్రాలూ కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలని, తెలుగువాడిగా, కేంద్ర మంత్రిగానూ తన సలహా ఇదేనన్నారు.
అన్యాయానికి గురైనవారు అప్పీలుకు వెళ్లే అవకాశముందన్నారు. కమలనాథన్ కమిటీ, ప్రత్యూష్సిన్హా కమిటీలను ఏర్పాటు చేసిందీ యూపీఏ ప్రభుత్వమే అన్నారు. హామీలపై దృష్టి పెడితే ఇరు రాష్ట్రాలకూ మంచిదన్నారు. సానియా మీర్జా గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి అన్న అంశాన్ని ఎవరూ ప్రశ్నించజాలరని, బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించాలో రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకుంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్పై తాను స్పందించబోనన్నారు.
వెంకయ్య నాయుడు
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా గడవకముందే ప్రతిదానికీ తప్పులు పట్టి సెల్ఫ్గోల్ కావడం కాంగ్రెస్కు సరికాదని, సుదీర్ఘంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీగా పరిపక్వతతో వ్యవహరించాలని సూచించారు. బ్రిక్స్ బ్యాంకుకు చైర్మన్గా భారత్కు గౌరవం లభించిందని, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యనీతిని ప్రదర్శించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతుందని, నిర్మాణాత్మక సహకారం అందించాల్సిన ఆ పార్టీ మొదటివారం నుంచే నిరసనలు ప్రారంభిందని ఎద్దేవా చేశారు.
వెంకయ్య నాయుడు
ధరలు పెరగడానికి పాత ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని, ధరల పెరుగుదలపై చర్చ సందర్భంగా పార్లమెంటులో అందరూ కాంగ్రెస్నే విమర్శించారన్నారు. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ చివరికి సెల్ఫ్గోల్ చేసుకుందన్నారు. బ్రిక్స్ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు పైనా కాంగ్రెస్కు అదే ఫలితం ఎదురైందన్నారు. సీ-శాట్కు సంబంధించి విద్యార్థుల ఆందోళన సందర్భంగా.. ప్రభుత్వం ఏం చేస్తున్నదంటూ ప్రశ్నించి మరోసారి కాంగ్రెస్ సెల్ఫ్గోల్ చేసుకుందన్నారు. ఆ విధానాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, వారు చేసిన మార్పులకు తమను బాధ్యులు చేస్తారా అని ప్రశ్నించారు.
వెంకయ్య నాయుడు
ప్రతిపక్షహోదాకు సంబంధించి స్పీకర్ను, అటార్నీ జనరల్నే కాంగ్రెస్పార్టీ విమర్శిస్తోందని, సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్నే అమలు చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేదన్నారు. మొన్నటివరకూ ఆ పార్టీ అర్జీనే పెట్టుకోలేదన్నారు. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ నిలిచిందని, అప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
వెంకయ్య నాయుడు
ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గడువునిచ్చి విమర్శలు చేయాలని, ప్రతిదానికీ తప్పులు పట్టి సెల్ఫ్గోల్ చేసుకోకుండా మరింత పరిపక్వతతో వ్యవహరించాలని సూచించారు. ధరలు పెరిగినప్పుడు కేంద్రం తక్షణమే స్పందించి కేబినెట్ సమావేశం నిర్వహించిందని, చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని తెలిపారు.