పరువు నష్టం దావా వేస్తాం: రేవంత్రెడ్డిపై ఆక్వా స్పేస్
హైదరాబాద్: రాయదుర్గం భూముల విషయంలో పూర్తి అవగాహన ఉన్న తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్రెడ్డి తమ గ్రూపుపై దుష్పచారం చేస్తున్నారని, ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. మై హోం గ్రూపుపై రేవంత్రెడ్డి చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా ప్రతిస్పందించింది.
రాయదుర్గం ప్రాంతంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ఐటీ, ఐటీఈఎస్ కార్యాలయాలకు అవసరమైన మౌలికసదుపాయాల కల్పనకు మై హోం గ్రూపు 2014 ఆగస్టులోనే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)లో భాగస్వామిగా చేరిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని పత్రాలు పొందిన రేవంత్రెడ్డి మై హోం గ్రూపు సంస్థ అధినేత రామేశ్వర్రావుపై తప్పుడు ప్రచారం చేయటం తగదన్నారు.
మై హోం గ్రూపు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుచిత ప్రయోజనం పొందలేదన్నారు. రాయదుర్గం భూముల వివాదంపై ఏ మీడియా సంస్థ కానీ, వ్యక్తులకు కానీ వివరణ కోరితే ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాయదుర్గంలోని భూములను డీఎల్ఎఫ్ వేలంలో ఎకరా రూ.31.35 కోట్లు చొప్పున 580 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి దక్కిన అనుచిత ప్రయోజనమేదీ లేదన్నారు. పూర్తిగా బహిరంగ వేలం ద్వారానే ఈ ప్రక్రియ జరిగిందన్నారు.
రూ.2000 కోట్ల విలువైన భూమిని మై హోం గ్రూపునకు చెందిన రామేశ్వర్రావుకు ఉచితంగా ఇచ్చారని రేవంత్రెడ్డి చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఈ భూమితో వాస్తవానికి రామేశ్వర్రావుకు ఎలాంటి సంబంధం లేదని, డీఎల్ఎఫ్ 2007లోనే దీన్ని బహిరంగ వేలంలో కొనుగోలు చేసిందని ప్రకటనలో వివరించారు.