జగన్ పార్టీని గెలిపించారు, మోసం..: గీతపై ఆగ్రహం
విశాఖపట్నం: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత తమ పార్టీ పైన లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలు అరకు లోకసభ స్ధానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించారన్న వాస్తవాన్ని మరిచిపోవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు లోకసభ ఇంఛార్జ్ బొడ్డేడ ప్రసాద్ గురువారం అన్నారు.
ప్రజల సమస్యలు గాలికి వదిలేయడం సబబుకాదని హితవు పలికారు. ఎంపీటీసీగా కూడా గెలవలేని కొత్తపల్లి గీతను ఎంపిగా చేసిన ఘనత తమ పార్టీకి దక్కుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం మంచి రాజకీయం కాదన్నారు. నిజంగా అధికార దాహం లేకపోతే, పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.
బాక్సైట్ తవ్వకాలలో వాటాలు, కమీషన్ల కోసం అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన గీత సొంత పార్టీని మోసం చేశారన్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిపొందిన కొత్తపల్లి గీత ఆ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.