కెసిఆర్తో అసదుద్దీన్ భేటీ: గ్రేటర్పై చర్చ, కెసిఆర్ హామి
హైదరాబాద్: ఎంఐఎం నేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును మంగళవారం కలిశారు. హైదరాబాద్ నగరంలోని సమస్యలపై ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. సమస్యలను పరిష్కరిస్తామని కెసిఆర్ అసదుద్దీన్కు హామీ ఇచ్చారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కెసిఆర్ అన్నారు.
ఈ భేటీలో త్వరలో జరగనున్న హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అసదుద్దీన్ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి మేయర్ పదవిని దక్కించుకోవాలని టిఆర్ఎస్, ఎంఐఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో అనుసరించాలని వ్యూహాలు, పొత్తు విషయంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మద్దతు పలికే అవకాశం ఉంది. వారి కోసం ప్రచారం కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి.