అప్పుడు మాట్లాడలేదేం: కెసిఆర్ను ప్రశ్నించిన అశోక్
న్యూఢిల్లీ: హైదరాబాదు శాంతిభద్రతలపై గవర్నర్కు అధికారాలు అప్పగించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరును కేంద్ర పౌర విమానయానాల మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పి. అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నం దునే ఇరు ప్రాంతాల ప్రజల సౌకర్యం కోసం శాంతిభద్రతల్ని పదేళ్లపాటు గవర్నర్కు కట్టబెట్టారని, దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అభ్యంతరాలు ఉంటే ఈ మేరకు చట్టం చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు.
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ను కలిసేందుకు శుక్రవారం నార్త్బ్లాక్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని పార్టీలూ తెలంగాణ కావాలని కోరాయని, రాయలసీమ, కోస్తాంధ్ర వారు తెలంగాణ ఇవ్వొద్దని కోరారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల వారికీ సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం పదేళ్లపాటు శాంతి భద్రతల్ని గవర్నర్కు ఇవ్వాలి బిల్లులోనే పేర్కొందని ఆయన గుర్తు చేశారు.
ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ దానిపై మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ఒకవేళ ఇది రాష్ట్ర అధికారాల్లోకి చొరబాటే అయితే బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడే ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. ఒకవేళ ఇప్పుడు అలా అనిపిస్తే కోర్టుకు వెళ్లొచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అంతా గందరగోళంగా ఉందని, స్థానికతకు 1956వ సంవత్సరాన్ని కొలమానంగా తీసుకోవటం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని విభజన బిల్లులో గత ప్రభుత్వం పేర్కొందని, ఆ హామీని ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని మిగతా విమానాశ్రయాలను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు.