ఆస్తులమ్మి 4 కోట్లిచ్చా: జగన్పై ఇంఛార్జ్ ఫైర్, కంటతడి
హైదరాబాద్: పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటూ నమ్మకంగా పని చేస్తే పార్టీ తనను నమ్మించి, నట్టేట ముంచిందని దెందులూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త అశోక్ గౌడ్ కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో అశోక్ గౌడ్ మాట్లాడారు. తన ఆవేదన వారితో పంచుకున్నారు.
ఇన్నేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బహుమతి ఇదేనని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం ఇంత చేసిన తనను నమ్మించి నట్టేటముంచారన్నారు. గత గురువారం జగన్ను కలిస్తే శుక్రవారం సాయంత్రానికి రూ.4 కోట్లు తీసుకొస్తే దెందులూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని నమ్మకంగా చెప్పారన్నారు.
ఆయన చెప్పిన మాటలు నమ్మిన తాను ఆస్తిని అమ్ముకుని, భార్యాబిడ్డలకు అన్యాయం చేశానని కన్నీటి కార్చారు. టిక్కెట్ ఇస్తానని మాట ఇవ్వడంతో తాను ఆస్తులు అమ్మి నాలుగు కోట్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు తనకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కారుమూరికి టిక్కెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
మరోవైపు అనంతపురం జిల్లా కదిరి స్థానాన్ని జగన్ పార్టీ తరపున సత్తార్ చాంద్బాషాకు కేటాయించడాన్ని ఆ పార్టీలోని ఇస్మాయిల్, కడపల మోహన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న జగన్ ఫ్లెక్సీలపై పాదరక్షలతో దాడి చేయడంతో పాటు వాటిని చించివేసి వాటిని దహనం చేశారు.