మీడియా బ్యాన్, మెట్రో: కెసిఆర్పై ముప్పేట దాడి
హైదరాబాద్: వంద రోజుల పాలన ముగిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై అన్ని వైపుల నుంచీ దాడి ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారంపై, మీడియా బ్యాన్పై ప్రతిపక్షాలన్నీ ఏకమై కెసిఆర్పై ఒత్తిడి పెంచిన సూచనలు కనిపిస్తున్నారు. మరోవైపు, విరసం వంటి ప్రజా సంఘాల కార్యాచరణ కూడా కెసిఆర్కు వ్యతిరేకంగా ప్రారంభమైంది. మీడియాపై సోమవారం ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అదే విధంగా విరసం నేత వరవరరావు నేతృత్వంలో ఆదివారంనాడు చేపట్టిన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కార్యక్రమం కెసిఆర్ను లక్ష్యం చేసుకుని సాగింది.
మెట్రో రైలు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి దూకుడుగా ఆరోపణలు చేస్తుంటే, కాంగ్రెసు తెలంగాణ నాయకులు అంతగా దూకుడు ప్రదర్శించకపోయినప్పటికీ విమర్శలు సంధిస్తున్నారు. బిజెపి విషయం చెప్పనే అవసరం లేదు. బిజెపి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ముందు నుంచి కెసిఆర్పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై కూడా ప్రతిపక్షాల గొంతు ఒక్కటవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాల నాయకులను, ప్రజాతంత్ర వాదులను కలుపుకుని ఈ ఉద్యమం ప్రారంభమైంది.
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదని, చట్టాలను ఉల్లంఘించడంపై కేసీఆర్ను ప్రశ్నించాలని బీజేపీ నేత నాగం జనార్థన్రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడీయా స్వేచ్ఛ - పరిరక్షణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ వార్తలను మీడియా బహిష్కరించాలని, అప్పుడు తెలిసి వస్తుందని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎంఎస్ఓలకు సెల్యూట్ చేయడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.
మీడియా మెడలు విరిచేస్తామని అనడం, 10 కిలోమీటర్ల మీర పాతరేస్తామని చెప్పడం తెలంగాణ సంస్కృతా? అని నాగం జనార్థన్రెడ్డి ప్రశ్నించారు. వెంటనే రెండు చానళ్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున ఈ రెండు చానళ్ల మీడియా ప్రతినిధులే ఉద్యమం చేస్తున్నారని, మిగిలిన చానల్స్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని నాగం ప్రశ్నించారు. భయపడుతున్నారా? అని ఆయన నిలదీశారు.
ఆ చానెళ్లే ముందున్నాయి...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్స్ ముందున్నాయని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అలాంటిది ఈ రెండు చానల్స్ను ఎందుకు నిషేధించారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడం భావ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో మరో ఉద్యమం వచ్చే పరిస్థితి తీసుకురావద్దని అరుణ హెచ్చరించారు. నిషేధం విధించి 100 రోజులు పూర్తి అయినప్పటికీ ఇంకా ఎన్నాళ్లు కొనసాగిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించామంటే మీడియా పాత్ర కూడా ఉందని ఆమె చెప్పారు.
టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, మరి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఎందుకు నిలినివేశారో అర్థం కావడం లేదని డికె అరుణ అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడం భావ్యం కాదని, అలాగే మీడియా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరినీ అవమానించే రీతిలో ఉండకూడాదని అరుణ సూచించారు.
పత్రికా స్వేచ్ఛకు భంగం వద్దు...
మెట్రో రైలు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణల యుద్ధం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ విషయంలో కెసిఆర్ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో నిషేధించిన చానెళ్లను వెటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే జోక్యం చేసుకుని రెండు చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
ప్రజల సహనానికి పరీక్ష పెట్టవద్దు..
ప్రజల సహనానికి పరీక్ష పెట్టవద్దని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు మీడియాపై నిషేధాన్ని ఎవరూ సహించబోరని, అలా చేస్తే చరిత్రహీనులుగా కెసిఆర్ మిగిలిపోతారని ఆయన అన్నారు. పత్రికలు కూడా నైతిక విలువలు పాటించాలని ఆయన అన్నారు
విలువ ఏం ఇస్తున్నారు..
నిజమైన ప్రజాస్వామ్యం కోసం దేశం ప్రసవవేదన పడుతోందని, సమాజానికి విలువలను వారసత్వంగా ఇచ్చినవారినే చరిత్ర గుర్తిస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం విలువలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణది పోరాల చరిత్ర అని ఆయన అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాల నిలిపివేతని కేసీఆర్ ఎలా చెప్పుకుంటారని హరగోపాల్ ప్రశ్నించారు.
తాను ఎన్టీ రామారావు దగ్గర నుంచి కేసీఆర్ వరకు అందరు ముఖ్యమంత్రులను కలిసానని, వారి అడిగినా అడగకపోయినా సలహాలు ఇచ్చానని హరగోపాల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీడియాపైగానీ, సభలపై గానీ ఆంక్షలు విధించడం సరికాదని, ఇవి మంచి సంకేతాలు కావని ఆయన అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
మీడియా బ్యాన్పై తీర్మానం
సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో జరిగాయని తెలంగాణలో మీడియా ఆంక్షలపై చర్చించి ఒక తీర్మానం చేశామని ఆ పార్టీ నేత నారాయణ వెల్లడించారు. తమ పార్టీ జాతీయ కౌన్సిల్ ఈ అంశంపై తీవ్రంగా ఖండించిందని అన్నారు. దేశంలో తప్పు చేయనివారు ఇద్దరే అని ఒకటి కడుపులో ఉన్న బిడ్డ, రెండు శవం ఈ రెండే తప్పులు చేయవని ఆయన అన్నారు. తప్పులు చేయడం మానవ సహజమని, దానిని పరిష్కరించుకోవడంలోనే గొప్పతనం ఉంటుందని నారాయణ అన్నారు. దీనికి ఈరోజుతో స్వస్తి పలకాలని ఆయన అన్నారు.
మీడియాను 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తామని కేసీఆర్ అన్నారని, 10 కిలోమీటర్లు తవ్విన తర్వాత అందులో ఎవరిని పాతిపట్టాలో ప్రజలకు తెలుసునని నారాయణ వెల్లడించారు. కాళోజీ చనిపోవడంతో కేసీఆర్ బతికిపోయారని, ఆయన బతికి ఉంటే కాళోజీ కలం గుణపాంలా మారేదని ఆయన అన్నారు. ప్రధాని మోడీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని నారాయణ సూచించారు. కేసీఆర్ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని, ధైర్యముంటే చానల్స్ను నేనే నిలిపివేయించానని చెప్పాలని నారాయణ సవాల్ చేశారు.
చానళ్ల నిలిపివేతకు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వం జోక్యం లేకండా రెండు చానల్స్ నిషేధించబడ్డాయా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలని, నిర్భయంగా మాట్లాడాలని నారాయణ సూచించారు.