జగన్ పార్టీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి, టీడీపీ పనేనని..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల పైన గుంటూరు జిల్లాలో దాడి జరిగింది. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త నాగిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. గొడ్డళ్లతో నరకడంతో నాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దీని పైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల పైన టీడీపీయే దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ.. తమను వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి పోలీసులు ఏజెంటుగా పని చేస్తున్నారని విమర్శించారు.
అనంతపురం జిల్లాలోని ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని తాడిపత్రి మండలం కొండేపల్లిలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తపై ప్రత్యర్థులు కొడవళ్లతో దాడి చేశారు. అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వారుగా తెలుస్తోంది. ఒకేరోజు తమ కార్యకర్తలపై రెండు దాడులు జరగడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.