చంద్రబాబు హామీ, ఏపీలో ఆస్ట్రేలియా రెడీ! మెట్రో ట్విస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం గేట్ వే ఆఫ్ ఇండియాగా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆస్ట్రేలియా ప్రతినిధులతో ఆన్నారు. హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఆస్ట్రేలియా ప్రతినిధులు బాబుతో భేటీ అయ్యారు. వారు పెట్టుబడుల పైన చర్చించారు.
ఆస్ట్రేలియా ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ తీర ప్రాంతం గేట్ వే ఆఫ్ ఇండియాగా మారుతుందన్నారు. భవిష్యత్తులో తీర ప్రాంతానికి భారీగా పెట్టుబడులు వస్తాయని వారితో ముఖ్యమంత్రి అన్నారు.
ఢిల్లీకి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రోత్సాహకాలపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలా చారి ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఆయన కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన ప్రోత్సాహకాల ప్రతిపాదనలను ఆయన కేంద్రానికి సమర్పిస్తారు.
మెట్రో రగడ
మెట్రో రైలు ప్రాజెక్టు పైన మీడియాలో వచ్చిన వార్త పెను దుమారాన్ని రేపింది. మెట్రో రైలు ప్రాజెక్టు నుండి తాము వైదొలుగుతామని ఎల్ అండ్ టీ లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎల్ అండ్ టీ అధికారులు, మెట్రో అధికారులు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఎల్ అండ్ టీ ఎండీ ఎండీ గాడ్గిల్ సీఎం కేసీఆర్ తదితరులను కలిశారు. అయితే, కొన్ని ప్రశ్నలకు గాడ్గిల్ సూటిగా సమాధానం చెప్పలేదు.