హిందూపురంలో బాలయ్య: కుప్పంలో లోకేష్
హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని స్థానిక శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ ప్రారంభించారు. అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
హౌసింగ్ బోర్డు కాలనీ, తదితర ప్రాంతాల్లో 2 రూపాయలకే 20 లీటర్ల శుద్ధమైన మంచినీటిని అందించే 9 కేంద్రానలు ఆయన ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. త్వరలో ఈ పథకాన్ని గ్రామాలకు విస్తరిచి, నియోజకవర్గంలో మంచి నీటి సమస్య లేకుండా చేస్తామని బాలకృష్ణ చెప్పారు.
ఒక్క రోజు పర్యటన కోసం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం యువనేత నారా లోకేష్క పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం చెప్పారు. కుప్పం శాసనసభా నియోజకవర్గానికి లోకేష్ తండ్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి లోకేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. శాంతిపురం మండలం రాళ్ల బొదుగూరు వద్ద నుంచి యువకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో లోకేష్ తెలుగుదేశం నాయకులతో సమావేశమయ్యారు.
విజయవాడలో చంద్రబాబు
విజయవాడలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురావారంనాడు ప్రారంభించారు ఈ పథకం కింద 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని పంపిణీ చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కామినేని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.