బస్సు నడిపిన బాలకృష్ణ, నందమూరి వంశానికి..
హిందూపురం: తెలుగు హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హిందూపురంలో ఆర్టీసీ నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన స్వయంగా బస్సు నడిపారు. ఈ బస్సులను ఆర్టీసీ సిబ్బంది విరాళాలతో కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అనంతపురం రీజియన్ మేనేజర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
కాగా, శనివారం అనంతపురం జిల్లా హిందూపురంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు తండ్రి, గురువు, దైవం అన్నీ ఎన్టీఆరే అన్నారు. నాయకుడంటే సేవకుడేనని నందమూరి బాలకృష్ణ అన్నారు.
నందమూరి వంశం ఈ స్థాయికి చేరిందంటే దానికి కారణం ప్రజలే అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం అందరినీ సమానస్థాయిలో ఆదరించడానికి పుట్టిందే తెలుగుదేశమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ బాటలోనే పయనిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తున్నారన్నారు. తన జీవితంలో రెండోదశ ప్రారంభమైందని చెప్పారు. తెలుగువారి గొప్పతనాన్ని దేశవిదేశాల్లో చాటాలని స్థానిక సప్తగిరి కళాశాలలో జరిగిన ప్రెషర్స్ డే కార్యక్రమంలో అన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, మునిసిపల్ చైర్పర్సన్ రావిళ్ళ లక్ష్మీ, వైస్ చైర్మన్ జేపీకే రాము తదితరులు పాల్గొన్నారు.