బాబు ఎఫెక్ట్: సోదరి పురంధేశ్వరికి బాలయ్య దూరమే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, నందమూరి హీరో బాలకృష్ణ తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరికి మద్దతుగా రాజంపేట లోకసభ స్థానంలో ప్రచారం చేసే అవకాశాలు లేనట్లు అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం బాలకృష్ణ ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి తరఫున రాజంపేట లోకసభ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
బిజెపితో తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో బాలకృష్ణ పురంధేశ్వరి కోసం రాజంపేట నియోజకవర్గంలో ప్రచారం చేసే అవకాశాన్ని తీసుకుంటారని భావించారు. కానీ, బాలకృష్ణ మాటలను బట్టి అలా జరిగే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. పురంధేశ్వరికి బిజెపి టికెట్ రాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డు పడ్డారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కూడా రాజంపేటకు దూరంగా ఉండేట్లు కనిపిస్తున్నారు.
తనకు ఎవరితోనూ విభేదాలు లేవంటూనే తన రూట్ మ్యాప్లో రాజంపేట లేదని, పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానని బాలకృష్ణ మంగళవారం అన్నారు. ఆయన మంగళవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. రాజంపేటలో మీ సోదరి పోటీ చేస్తున్నారు కదా, అక్కడ ప్రచారం చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన ఆ విధంగా అన్నారు.
పార్టీ ఆదేశిస్తే అనే మాటలను ఆయన జాగ్రత్తగా వాడినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప ఆయన రాజంపేటలో ప్రచారం చేసే అవకాశం లేదని దాని ద్వారా అర్థమవుతోంది. మొత్తం మీద, పురంధేశ్వరిపై చంద్రబాబు ఏ మాత్రం మెతక వైఖరిని తీసుకోవడం లేదని తాజా పరిణామాన్ని బట్టి కూడా అర్థమవుతోంది.