వైఎస్ని టార్గెట్ చేసిన బాలకృష్ణ, 20నుంచి చిరు ప్రచారం
అనంతపురం/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ తన ప్రచారంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేశారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరగడానికి వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమన్నారు.
తెలుగుదేశం పార్టీ గాలికి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కొట్టుకు పోవడం ఖాయమన్నారు. టిడిపి ప్రభంజనం వీస్తోందన్నారు. సెజ్లకు ఇచ్చిన భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుంటే టిడిపి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకొని రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు.
20 నుండి చిరు ప్రచారం
ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఎపి కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శ్రీకాకుళం నుంచి ఆయన ప్రచారం ప్రారంభమవుతుంది.
కెసిఆర్ను తిడితే ఓట్లు రావు: హరీష్
కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని... కెసిఆర్ను తిట్టినంత మాత్రాన కాంగ్రెస్కు ఓట్లు రాలవని తెరాస నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణలో వందలాది మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. జైరాం రమేష్కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఏనాడైనా ఆయన అమరవీరుల కుటుంబాలను కాని, ఉద్యమకారులను కానీ పరామర్శించారా అని ప్రశ్నించారు.
ఆ పార్టీలకు ఓటు వద్దు: కోదండ
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ఓటు వేయవద్దని టిజెఏసి చైర్మన్ ఆచార్య కోదదండరాం శుక్రవారం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో, విచక్షణతో ఓటు వేయాలన్నారు. తెలంగాణకు ఎవరు సహకరించారో, ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు తెలుసునన్నారు.