జగన్ పార్టీపై బాలకృష్ణ అసహనం, శ్రీకాంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం అన్నారు. సోమవారం ఉదయం గాయంతో అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ సభ పదేపదే వాయిదా పడటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ వాయిదా పడిన వెంటనే తిరిగి వెళ్తూ అసెంబ్లీ లాబీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా షూటింగ్లో తనకు తగిలిన గాయంపై మాట్లాడారు. ప్రతి సినిమా షూటింగ్లో తనకు గాయం గుర్తుగా ఉంటుందన్నారు. తాజా ప్రమాదంలో ఏడు కుట్లు పడ్డాయని, తగ్గడానికి మరో వారం రోజుల సమయం పడుతుందన్నారు. సభ జరిగిన తీరు పట్ల అభిప్రాయం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల నిరసనలు తప్ప ప్రజా సమస్యలు చర్చకు రానివ్వడం లేదని, ఇది చాలా బాధ కలిగించే అంశమన్నారు.
అసెంబ్లీ అంటే గౌరవం లేదు
అసెంబ్లీ అంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులకు గౌరవం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ హయాంలో నరమేధం సాగిందని, టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. హత్యా రాజకీయాలపై మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు.
హత్యా రాజకీయాలపై చర్చకు సిద్ధం
హత్యారాజకీయాలకు పులివెందులే కేంద్రమని, ఆ పార్టీ ఆరోపణలపై ఆధారాలు చూపాలని విప్ కూన రవికుమార్ డిమాండ్ చేశారు. చేసిన హత్యలను కప్పి పుచ్చుకోవడానికి బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారన్నారు. హత్యా రాజకీయాలపై చర్చకు సిద్ధమన్నారు.
శాసమండలిలో వ్యవసాయ బడ్జెట్: యనమల
శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రవేశపెడతారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మండలిలో సాధరణ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నటు ఆయన తెలిపారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉన్నప్పటికీ ద్రవ్యవినిమయ బిల్లు మాత్రం ఒకటే ఉంటుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.
శాంతిభద్రతలు క్షీణించాయి: శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని అంతకుముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వమే ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మాఫియాను వెనుకేసుకొస్తోందని ఆరోపించారు. వంగవీటి హత్య కేసులో సీబీఐ విచారణకు సిద్ధమా అని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.