20 నుండి బాలయ్య టూర్, రెండ్రోజులు అక్కడ: టిలో నో
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఈ నెల 20వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. శ్రీకాకుళం నుండి కడప వరకు రోజుకో జిల్లాలో ప్రచారం చేసేలా ప్రణాళికను పార్టీ రూపొందించింది. ప్రచారం ముగిసే చివరి రెండు రోజులు తాను పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గానికి కేటాయిస్తారు.
20వ తేదీన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి బాలకృష్ణ ప్రచార యాత్రను ప్రారంభిస్తారు. విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా వరకు మొదటి విడత యాత్ర కొనసాగుతుంది. మిగతా జిల్లాల్లో రెండో విడత ఉంటుంది. చివరి రెండు రోజులు హిందూపురంకు కేటాయిస్తారు. కాగా, ప్రణాళిక చూస్తుంటే తెలంగాణ ప్రాంతంలో పర్యటించే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి.
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రచారం ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఉదయం మాయసముద్రం, మలూగరలో నిర్వహించిన రోడ్షోలో బాలయ్య ప్రసంగించారు. కాంగ్రెస్ది అవితీనివాదం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీది అరాచకవాదం అని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని బాలయ్య స్పష్టం అన్నారు. తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందూపురంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలకృష్ణ అన్నారు.