టీవీ చానెళ్ల బ్యాన్: ఎంఎస్వోలకు కేంద్రం నోటీసు
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ, ట్రాయ్ ఒకేసారి స్పందించాయి. ఎమ్మెస్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. తెలంగాణలో రెండు చానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఆ శాఖ కార్యదర్శి రాసిన లేఖలపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ తమకు సంబంధం లేదంటూ జవాబు రాసింది.
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు, 1994లోని 16వ ఉప నిబంధన కింద మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో తెలపాలంటూ తెలంగాణలోని అన్ని ఎంఎస్వోలకూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ ఆదేశాలపై ఈనెల 17నే ఈ మంత్రిత్వ శాఖ అధికారి సంతకం చేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా చానళ్లను ఎందుకు నిషేధించారో ఆగస్టు 11 నాటికి తెలపాలంటూ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ఎంఎస్వోలకూ నోటీసులు పంపింది. కాగా, ఒక రాష్ట్రంలో రెండు ప్రధానమైన వార్తా చానళ్లను నెల రోజులకుపైగా నిషేధించినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నించాలని దాదాపు పదిమంది ఎంపీలు నిర్ణయించారు.
ఇప్పటికే రేణుకా చౌదరి, వి.హనుమంతరావు, ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎంఏ ఖాన్, గుండు సుధారాణి, సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితరులు ఈ విషయాన్ని సభలో ప్రశ్నించాలని నిర్ణయించారు. సిపిఐ సభ్యుడు డి.రాజా, కాంగ్రెస్ నేత వాయలార్ రవి తదితరులు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.