తెలంగాణ భవన్లో దత్తాత్రేయకి అవమానం, టీఆర్ఎస్ వల్లే
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయకు తెలంగాణ భవన్లో పరాభవం ఎదురైంది. ఆయనకు గది కేటాయించడంలో తెలంగాణ భవన్ అధికారులు రోజుకో రకంగా వ్యవహరిస్తూ దత్తాత్రేయను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఎక్కువమంది ఉండడంతో వారికి విడిది కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అశోకా హోటల్లోనూ, ఆయా రాష్ట్రాల భవన్లలోనూ ఉండేందుకు ఏర్పాట్లు చేసింది.
దత్తాత్రేయ తెలంగాణ భవన్లో విడిది చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులు ఆయనకు గోదావరి బ్లాక్లో గది కేటాయించారు. అయితే నిర్వాహణా లోపం కారణంగా ఆ బ్లాక్లో ఏసీలు పని చేయడం లేదు. దీంతో తనకు వేరే గదిని కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. అధికారులు ఆయనకు శబరి బ్లాక్లో మరో గదిని ఇచ్చారు. దత్తాత్రేయ ఆ గదికి మారారు. అయితే, అంతలోనే ఆ గదిని ఖాళీ చేయాలని అధికారులు ఆయనకు సూచించారు.
ఆ గదిని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్కు కేటాయించినందున ఖాళీ చేయాలన్నారు. తనకు గదిని ఎప్పుడు కేటాయించారు? ఎప్పుడు రద్దు చేశారు అని దత్తాత్రేయ అధికారులను నిలదీశారు. ఆ తర్వాత ఆయనకు స్వర్ణముఖి బ్లాక్లోని గది కేటాయించినా.. గురువారం ఆ గదికి తాళాలు ఉన్నాయి. దీనిపై ఆయన మరోసారి అధికారులను నిలదీశారు. దీంతో, వారు.. ఈ గది న్యాయమూర్తుల కోటాకు సంబంధించిందని చెప్పారు.
చివరకు దత్తాత్రేయ గోదావరి బ్లాక్లో తనకు మొదట కేటాయించిన ఏసీ పని చేయని గదికే మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ అనుచరులు తెలంగాణ భవన్ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో తెలంగాణ భవన్ టీఆర్ఎస్ భవన్గా మారిపోయిందని దత్తాత్రేయ అనుచరులు ఆరోపించారు. దత్తాత్రేయను కావాలనే అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాగా, తెలంగాణకు కొన్ని గదులో ఉండటంతో ప్రోటోకాల్ ప్రకారమే కేటాయిస్తామని అధికారులు చెప్పారు.