చంద్రబాబును మెచ్చుకున్న అమిత్షా: మోడీపై బాబు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పాలన అద్భుతంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు పరస్పరం బిజెపి-తెలుగుదేశంల సహకారం, మద్దతుపై అభినందనలను తెలుపుకున్నారు.
చంద్రబాబునాయుడు పనితీరు చాలా బావుందని ఈ సందర్భంగా అమిత్షా అభినందించినట్టు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. అమీర్పేటలోని మేరీగోల్డ్ హోటల్లో భారతీయ జనతా పార్టీజాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పలువురు పార్టీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, న్యాయవాదులు కలిశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఇతర నేతలు అమిత్షాతో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగరరావు, సినీ నిర్మాత అశ్వినీ దత్, డాక్టర్ రమేష్, డాక్టర్ వినోద్, శ్రీనిరాజు తదితరులు కూడా అమిత్షాను కలిశారు. అంతకు ముందు అమిత్షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఏపిలో చంద్రబాబు పాలన తీరు బాగుందని అమిత్షా మెచ్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ బిజెపి-టిడిపి సహకారంపై చర్చించినట్లు తెలిసింది.
గురువారం రాత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్.. అమిత్షాను కలిశారు. కేంద్రప్రభుత్వ పనితీరు బావుందని, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆచరణ సాధ్యం కాని విషయాలను చెప్పడం లేదని పవన్ అన్నారు. ఆగటస్టు 19న జరిగిన సర్వే రోజు తాను హైదరాబాద్లో లేనని అన్నారు. కాగా, హైదరాబాద్ పర్యటనలో అమిత్షా పలు టీవీ చానళ్లను సందర్శించారు. 6-టివి తెలంగాణ ఛానల్ను ఆయన ఆవిష్కరించారు. టివి-5 స్టూడియోను సందర్శించి వార్తాప్రసారాల విధానాన్ని ఆసక్తిగా తిలకించారు.