సో సింపుల్: లగ్జరీ హోటల్ వద్దన్న అమిత్ షా
హైదరాబాద్: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన హైదరాబాదు పర్యటనలో లగ్జరీ హోటల్లో బస చేయడానికి నిరాకరించారు. బిజెపి సీనియర్ నాయకులకు పొదుపు లక్షణాన్ని, సంప్రదాయాన్ని అందించడానికే ఆయన లగ్జరీ హోటల్లో ఉండడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు.
రెండు రోజల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా నిజానికి, పార్టీ కార్యాలయంలోనే ఓ గదిని తన కోసం ఏర్పాటు చేయాలని సూచించారని అంటున్నారు. అయితే, నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో తాను బస చేస్తానని ఆయన చెప్పారు. భద్రతా కారణాల రీత్యా తాము ప్రభుత్వ అతిథి గృహాన్ని అడిగినట్లు బిజెపి తెలంగాణ నాయకులు చెబుతున్నారు.
చివరకు టూరిజం ప్లాజాలోని హరితా హోటల్లో బస చేయడానికి చివరికి అమిత్ షాను ఒప్పించినట్లు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లగ్జరీ హోటళ్లను, చార్టర్డ్ విమానాలను వాడకూడదని ఆయన పార్టీ నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు.
అత్యవసరమైతే తప్ప అమిత్ షా చార్టర్డ్ విమానాలు వాడబోరని ఆయన కార్యాలయం అధికారులు చెప్పారు. హైదరాబాద్కు అమిత్ షా గురువారంనాడు బడ్జెట్ ఎయిర్లైన్లో వచ్చారు. ఎయిర్ ఇండియా కమర్షియల్ విమానంలో ఆయన తిరిగి వెళ్లారు.