బాబుకి షాక్, కుప్పం బరిలో బిజెపి!: 3 చోట్ల టిడిపి షాక్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు సొంత నియోజకవర్గంలోనే మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఝలక్ ఇచ్చింది. బాబుకు కూడా స్వయంగా పొత్తు సెగ తాగింది. చంద్రబాబు పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బిజెపి తరఫున నామినేషన్ దాఖలు కావడం సంచలనం సృష్టించింది.
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ శనివారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక టిడిపి నేతల తీరుపై అసంతృప్తితోనే తాను నామినేషన్ దాఖలు చేసినట్లు తులసీనాథ్ చెప్పారు. టిడిపితో కలిసి ప నిచేద్దామనుకుంటే, ఆ పార్టీ నుంచి కనీసమైన గౌరవం తనకు దక్కడం లేదని, బాబు తరపున నామినేషన్ వేయడానికి వచ్చిన నారా లోకేశ్ పర్యటన గురించి కనీస సమాచారం కూడా తనకివ్వలేదని, ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడంలేదని చెప్పారు.
బిజెపికి టిడిపి షాక్
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో బిజెపికి షాక్ తగిలింది. పొత్తులో భాగంగా టిడిపి ఆ స్థానాన్ని బిజెపికి కేటాయించింది. అయితే ఇటీవల పార్టీలో చేరిన విజయ్ కుమార్ను అక్కడి నుంచి బరిలో దించాలంటూ టిడిపి అధిష్ఠానంపై స్థానిక నేతలు ఒత్తిడి పెంచారు. దీంతో విజయ్ కుమార్ను పోటీకి దించుతూ చంద్రబాబు నిర్ణయించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో భాగంగా తమకు దక్కిన గుంతకల్లు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా వెంకటరామయ్యను బిజెపి ఎంపిక చేసింది.
అయితే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలంటూ బిజెపికి టిడిపి సూచించింది. అయితే టిడిపి సూచనను తోసిపుచ్చిన బిజెపి వెంకటరామయ్యతో నామినేషన్ వేయించింది. దీంతో టిడిపి సైతం తమ పార్టీ నేత జితేంద్రగౌడ్తో నామినేషన్ వేయించింది. అనంతపురం అర్బన్లో సురేంద్ర బాబును అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సంకేతాలిచ్చిన టిడిపి అనూహ్యంగా మున్సిపల్ మాజీ చైర్మన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరితో నామినేషన్ వేయించింది.