టిఆర్ఎస్లోకి ఫరీద్, నరేంద్రనాథ్!: జగ్గారెడ్డికి షాక్
హైదరాబాద్/మెదక్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎండి ఫరీదుద్దీన్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గురువారం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలో ఆయన టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఫరీదుద్దీన్ ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి గీతారెడ్డితో విభేదాలు తలెత్తాయి.
దీంతో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఎంపి, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఫరీదుద్దీన్ పరోక్షంగా టిఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని గీతారెడ్డి అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫరీద్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం నెల రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఫరీదుద్దీన్ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఆయన అనుచరులు ఇప్పటికే టిఆర్ఎస్లో చేరారు.
ఇది ఇలా ఉండగా మెదక్ లోకసభ ఉప ఎన్నిక నేపథ్యలంలో జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, నరేన్ ట్రస్ట్ అధినేత చాగండ్ల నరేంద్రనాథ్ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. నరేంద్ర నాథ్ 2009లో మెదక్ ఎంపి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో బిజెపిలో చేరారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న నరేంద్రనాథ్కు ప్రజల్లో మంచి పేరుంది.
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర నాథ్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా బిజెపి నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమిపాలయ్యారు. దీంతో అప్పట్నుంచి ఆయన బిజెపికి దూరంగా ఉంటున్నారు. నరేంద్ర నాథ్ తోపాటు సిద్దిపేటకు చెందిన బిజెపి సీనియర్ నేత చొప్పదండి విద్యాసాగర్ కూడా టిఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. వీరిద్దరూ బిజెపిని వీడితే ఆ పార్టీకి భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల బిజెపిలో చేరి మెదక్ ఎంపి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి ఇది షాక్కు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు.