కేసీఆర్ ఏం చేశారని బీజేపీ, సంబంధం లేదని కోదండ
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు దగ్గర తెలంగాణ జేఏసీ గురువారం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర సమితి పైన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ఆయన విమర్శలు వ్యక్తిగతమని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ వివరణ ఇచ్చారు.
పోలవరం ఆర్డినెన్స్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ ధర్నా సందర్భంగా అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పాలన్నారు.
ఆయన వ్యాఖ్యల పైన బీజేపీ నేత అశోక్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఆర్డినెన్స్ విషయంలో తెరాస తమ పార్టీని నిందించడం సరికాదన్నారు. ఆర్డినెన్స్ రూపొందించినప్పుడు కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పోలవరం అంశం విషయంలో తెరాసకు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఆయనను ఖమ్మం జేఏసీ అడ్డుకుంది. అశోక్ యాదవ్ వ్యాఖ్యల పైన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ వివరణ ఇచ్చారు. అశోక్ వ్యాఖ్యలతో జేఏసీకి సంబంధం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని చెప్పారు.