విజయశాంతి, జగ్గారెడ్డిలకు బిజెపి డోర్స్ మూసివేత
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి, మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి బిజెపి తలుపులు మూసేసినట్లు తెలుస్తోంది. వారిద్దరు కూడా బిజెపిలో చేరి మెదక్ లోకసభ సీటుకు పోటీ చేయాలని ఆశపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజీనామా వల్ల మెదక్ లోకసభ సీటు ఖాళీ అయింది. దీంతో దానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
కాంగ్రెసు నుంచి మెదక్ అసెంబ్లీ సీటుకు విజయశాంతి, సంగారెడ్డి సీటుకు జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. విజయశాంతి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెసులో చేరారు. ఆమె మెదక్ లోకసభ సీటు నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం ఆమెను మెదక్ శాసనసభ సీటు నుంచి పోటీకి దింపింది.
ఇరువురు నాయకులకు కూడా బిజెపి జాతీయ నేతలతో సత్సంబంధాలున్నాయి. అయితే, వారిద్దరిని చేర్చుకోవడానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఇష్టంగా లేరని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మెదక్ లోకసభ సీటు నుంచి బిజెపి పోటీ చేసింది. దాంతో ఉప ఎన్నికల్లో కూడా బిజెపికే ఆ సీటు దక్కుతుందని విజయశాంతి, జగ్గారెడ్డి భావించి ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు.
కిషన్ రెడ్డి మెదక్ లోకసభ సీటు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో మెదక్ లోకసభ సీటును ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ శాసనసభ పక్ష నేతగా తాను ఉండకుండా డాక్టర్ కె. లక్ష్మణ్ ఎంపికయ్యేలా చూశారని అంటున్నారు.
అయితే, విజయశాంతి, జగ్గారెడ్డి మాత్రం తాము ఇలాగే ఉండిపోతే వచ్చే ఎన్నికల నాటికి ఏమీ కాకుండా పోతామనే ఆవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో కొనసాగితే తమకు భవిష్యత్తు కూడా ఉండదనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీంతో బిజెపిలో చేరడమే మంచిదని వారు అనుకుంటున్నట్లు చెబుతున్నారు.