పెరట్లో: బొజ్జల ఘాటు చురక, టీడీపీలో రాజధాని రభస
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీలోను గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. రాజధాని విషయంలో రెండు పార్టీల నేతలు తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వస్తున్న డిమాండ్లపై మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గురువారం ఘాటుగా స్పందించారు. సొంత పార్టీ నేతలకు కూడా ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ తమ పెరట్లోనే రాజధాని ఉండేలా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. భూముల లభ్యత, అన్ని ప్రాంతాలకు అనువైన చోటే రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. అయితే, రాజధానిపై ఎవరు మాట్లాడవద్దని ఇరు పార్టీల నేతల అధినేతలు తమ తమ పార్టీ వారిని వారిస్తున్నారు.
బొజ్జల
రాజధాని పైన ఎవరికి వారు మాట్లాడుతుండటంతో, మంత్రి బొజ్జల స్పందిస్తూ.. ప్రతి ఒక్కరు తమ పెరట్లోనే రాజధాని ఉండేలా ఆలోచిస్తున్నారని చురకలు అంటించారు.
పీ నారాయణ
విజయవాడ - గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండవచ్చని ఏపీ పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ పలుమార్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
కేఈ కృష్ణమూర్తి
విజయవాడ తాత్కాలిక రాజధానియేనని, పూర్తిస్థాయి రాజధాని కాదని రెండు, మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వం భూమి విజయవాడ - గుంటూరు మధ్య లేదన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి
రాయలసీమవాసులు తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చెప్పారు. మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని ఆయన ఎప్పుడో సూచించారు.