రోత పుట్టించారు: బాబుపై కాంగ్రెస్, పక్కనే చిరంజీవి
విజయవాడ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలన పైన మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు శ్వేతపత్రాలకు కౌంటరుగా వాస్తవ పత్రాలు అంటూ విడుదల చేసింది.
ఈ సమావేశంలో చిరంజీవి, కేవీపీ రామచంద్ర రావు, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘువీరా మండిపడ్డారు. చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో రోత పుట్టించారన్నారు.
వందరోజుల బాబు పాలన పైన ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని బొత్స అన్నారు. బాబు వంద రోజుల పాలన పైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నార్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెసు హయాంలో అమలైన పథకాలను అటకెక్కించారని విమర్శించారు.
కొనసాగుతున్న ఏపీ 'ఈ-కేబినెట్' సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం లేక్ వ్యూ అతిథి గృహంలో మూడు గంటలుగా కొనసాగుతోంది. దేశంలోనే తొలిసారిగా కాగితరహితంగా జరుగుతున్న ఈ భేటీలో ఐపాడ్ లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో పథకాలపై చర్చిస్తున్నారు. వంద రోజుల పాలనపై మంత్రులతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలు, రుణమాఫీకి దశలవారీగా నిధుల విడుదల, విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది.