మంటలకు ఆర్టీసి పుష్పక్ ఎసి బస్సు ఆహుతి
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ కూడలిలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీకి చెందిన పుష్పక్ ఏసీ బస్సు మంటలకు ఆహుతైంది. బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు.
వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. రాణిగంజ్ డిపోకు చెందిన ఈ బస్సు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎవరికీ ఏ విధమైన ప్రమాదం జరగలేదు.
బస్సు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రమాదం జరిగినప్పుడు నలుగురైదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. మంటలకు బస్సు పూర్తిగా ఆహుతి అయింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సు అగ్ని ప్రమాదానికి గురై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు.