సిటీలో భారీ దోపిడీ: మహిళా రైతు తలలోకి బుల్లెట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని బేగంబజార్లో భారీ దోపిడీ జరిగింది. గత రాత్రి ఆటోలో వెళ్తున్న వ్యాపారుల కళ్లలో కారం చల్లిన దుండగులు వారి నుంచి రెండు కిలోల బంగారాన్ని, నగలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు.
రాత్రి తమ కార్యకలాపాలను ముగించుకుని లాడ్జికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి తమ ఆటోను ఆపి కళ్లలో కారం చల్లి బంగారాన్ని అపహరించారని వ్యాపారులు తెలిపారు. నగల వ్యాపారులను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో మిస్ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ సంతోష్ రాజు పిల్లల ఆస్పత్రిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో పలువురు పిల్లలకు షాక్ తగలడంతో మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైరింగ్ లోపం వల్ల షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తోంది. చిన్నారులకు ఎలాంటి ప్రాణపాయ పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నారు.