హత్య కేసు: లొంగిపోయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి
హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం న్యాయస్థానంలో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. నందికొడ్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ హత్య కేసులో బైరెడ్డి నిందితులుగా ఉన్నారు. బుధవారం ఉదయం బైరెడ్డి కర్నూలు జిల్లా కోర్టులో లొంగిపోయారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో అరకిలో బంగారం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన నిజామాబాద్ జిల్లా వాసి నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్యాసింజర్ రైలులో డీజిల్ లీక్
మాచర్ల-భీమవరం ప్యాసింజర్ రైలులో డీజిల్ లేకేజ్ కారణంగా బుధవారం బెల్లంకొండ వద్ద రైలును నిలిపివేశారు. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు.
పహాడీషరీఫ్ పరిధిలో పోలీసుల తనిఖీలు
నగరంలోని పహాడీషరీఫ్ పరిధిలో గత అర్థరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 350 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ సీపీ ఆనంద్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్నేక్ గ్యాంగ్ ఏ-1 నిందితుడు ఫైసల్దయానీ ఇంట్లో రెండు గుర్రాలు, కారు, రెండు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైసల్దయానీ సోదరులు అమీర్, అఖిల్లను అరెస్ట్ చేశారు.
స్నేక్ గ్యాంగ్ నిందితులు చోరీల కోసం గుర్రాలను వాడారని, జంతు హింస కింద కేసు నమోదు చేశారు. అలాగే తనిఖీల్లో భాగంగా 8 మంది రౌడీ షీటర్లు, మరో 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల్లో ఐదుగురు స్నేక్గ్యాంగ్ నిందితులకు సహకరించినట్టు సమాచారం. 30 బైక్లు, మూడు వ్యాన్లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.