కేసీఆర్ పోటీ: హీరోని దక్కించుకున్నబాబు, ఏడాదిలో..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే రాష్ట్రానికి అతిపెద్ద ఆటో మొబైల్ పరిశ్రమను సాధించింది. దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజమైన హీరో మోటో కార్ప్ పెట్టుబడులను ఆకర్షించింది. ఈ సంస్థ దక్షిణాదిలో ఏర్పాటు చేయదల్చుకున్న ప్లాంటును దక్కించుకునేందుకు వివిధ రాష్ట్రాలు ప్రయత్నాలు చేశాయి. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయత్నించింది. అయితే, ఏపీకే దక్కింది.
హీరో సంస్థ దక్షిణాదిలో తమ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. హీరో మోటో కార్ప్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్లో యూనిట్ ఏర్పాటు చేస్తే సకల సౌకర్యాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాల వలన తొలుత ఏపీలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ మొగ్గుచూపింది.
ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. తన వంతు ప్రయత్నాల్లో భాగంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను రంగంలోకి దింపింది. అప్పట్లో ప్రదీప్ చంద్ర దీని కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి హీరో కంపెనీ సీవోవో విక్రమ్ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని వసతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ తర్వాత తెలంగాణలో తమ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది.
మరోవైపు, హీరో దక్షిణాదిలో తన తొలి ప్రాజెక్ట్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ చంద్రబాబు తన ప్రయత్నాలు మానలేదు. చాప కింద నీరులా ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే, మొన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్తో భేటీ అయ్యారు. ఏపీకే ప్లాంట్ వచ్చేలా ప్రయత్నాలు చేశారు.
కాగా, చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సెజ్ సమీపంలో 600 ఎకరాలు హీరోకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు, ఒప్పందం కుదుర్చుకోవడానికి హీరో సంస్థ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు.
ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా మరో ఆరేడువేల మందికి మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. రెండున్నరేళ్లలో ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు, జపాన్కు చెందిన ఇసుజీ మోటార్స్ శ్రీసిటీలో ప్లాంటు నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఏడాదిలోగా వాహనాల తయారీ ప్రారంభం అవుతుంది.