కిరణ్ రెడ్డి సిక్సర్ కొడ్తాడా, డకౌట్ అవుతాడా?
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి తన అభ్యర్థులను దించారు. తాను మాత్రం పోటీకి దూరంగా ఉండి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు శానససభా నియోజకవర్గం నుంచి తన సోదురు కిశోర్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడానికి, తెలుగుజాతిని ఐక్యంగా ఉంచడానికి తాను పార్టీ పెట్టినట్లు ఆయన చెప్పుకుంటున్నారు. కాంగ్రెసు పార్టీపైనే కాకుండా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో తమకు ఓటేయాలని అడుగుతున్నారు. అయితే, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు ధీటుగా ఆయన తన రాజకీయాలను నడపలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వెంట నడుస్తామని హామీ ఇచ్చిన పలువురు నాయకులు కూడా ఇప్పుడు ఆయనకు దూరమయ్యారు. పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది ఎవరి దారి వారు చూసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సరోజమ్మ, ఎన్ అమర్నాథ్ రెడ్డి దంపతులకు హైదరాబాదులో జన్మించారు. అందుకే, రాష్ట్ర విభజన అంశం ముందుకు వచ్చిన ప్రతిసారీ తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి అత్యంత విధేయుడు. పివి నర్సింహారావు ప్రభుత్వం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం మాత్రం చిత్తూరు జిల్లాలోని నగరిపల్లెకు చెందింది.
కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి మరణం తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఆయన మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సొంత నియోజకవర్గం వాయల్పాడు (వాల్మికీపురం) నుంచి 1989, 1999, 2004లో శాసనసభకు ఎన్నికయ్యారు.వాల్మీకిపురం పీలేరులో విలీనమైంది. దీంతో 2009 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, విధేయుడిగా పనిచేశారు. దీంతో ఆయన 2004లో ప్రభుత్వ చీఫ్ విప్గా ఎంపికై ఐదేళ్ల పాటు పనిచేశారు. 2009 ఎన్నికల్లో వైయస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ స్పీకర్ పదవిని చేపట్టారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో కాంగ్రెసు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ సమయంలో శాసనసభ్యుల సూచనను కాదని కాంగ్రెసు అధిష్టానం సీనియర్ నేత కె. రోశయ్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఆయన తప్పుకున్న తర్వాత అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించింది.
రాజకీయాలకు రాక ముందు కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్. విద్యార్థిగా ఉన్నప్పుడు రంజీలో రాష్ట్రానికి, సౌత్ జోన్కి ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన ఆ విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ వ్యతిరేకిగా ఆయనను ప్రత్యర్థులు అభివర్ణించినప్పుడు తాను నిజాం కళాశాల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించానని, తన జట్టులో మొహమ్మద్ అజరుద్దీన్ ఉండేవాడని ఆయన చెప్పుకునేవారు.