కేసు: యస్.. రౌడీనేనంటూ ఊగిపోయిన జేసీ!
అనంతపురం: తాడిపత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేయడంతో మంగళవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జేసీ పైన కేసును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఆందోళనకు మద్దతుగా భారీగా ప్రజలు తరలి వచ్చారు.
ఎస్బీఐ ముందు చాలాసేపు ధర్నా చేపట్టారు. అధికారులు, జేసీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జేసీ అనుచరులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. తాడిపత్రి అట్టుడికిపోయింది. తాను తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడితే.. ఎస్బీఐ అధికారులు తన పైన కేసు పెట్టడమేమిటని జేసీ ప్రశ్నించారు.
కాగా, ఎస్బీఐ ఏటిఎం వద్ద చెత్త పడేశారని సిబ్బందిపై ఎమ్మెల్యే జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంక్ అధికారులు జెసి ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 506, 353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, మంగళవారం జేసీ, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. దీంతో ఎస్బీఐ అధికారులు కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో తాడిపత్రిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.'
కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ.. యస్, తాను రౌడీనేనని, మంచివాళ్లకు మంచివాడినని, చెడ్డవాళ్లకు చెడ్డవాడినని అన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కావాలనే తన పైన కేసు పెట్టారని ఆరోపించారు. తాడిపత్రిలో తన పైన కుట్ర జరుగుతోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను భయపడేది లేదన్నారు. తాను సీఎంను కలుస్తానని చెప్పారు..