జబర్దస్త్ గేమ్ షో: నాగబాబు, రోజా, రేష్మీలపై కేసు
కరీంనగర్: ప్రముఖ టీవీ చానెల్ ఈటీవీ 2లో ప్రసారమవుతున్న జబర్దస్త్ టీవీ గేమ్ షో మరో వివాదంలో చిక్కుకుంది. ఆ టీవీ షో యాంకర్ రేష్మీ, జడ్జీలు నాగబాబు, రోజాలపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. దాంతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ పోలీసులు ఆ ముగ్గురిపై గురువారంనాడు కేసు నమోదు చేశారు.
బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీశారనే ఆరోపణపై ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ సబ్ ఇన్స్పెక్టర్ పి. దామోదర్ రెడ్డి చెప్పారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ ఎపిసోడ్ ఉందనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ ఎపిసోడ్ నిరుడు నవంబర్ 2వ తేదీన ప్రసారమైంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కరీంనగర్ అదనుపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య తగాదా పెట్టే విధంగా ఆ ఎపిసోడ్ ఉందని ఆయన ఆరోపించారు.
కాగా, అంతకు ముందు గౌడులను అవమానించే విధంగా ఉందంటూ ఓ ఎపిసోడ్పై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వేణుపై దాడి కూడా జరిగింది. దానిపై నాగబాబు, ఇతర టీవీ గేమ్ షో ఆర్టిస్టులు తీవ్రంగా ప్రతిస్పందించారు. గేమ్ షోను ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదని నాగబాబు కచ్చితంగా చెప్పారు.