ఎపి బ్రాండ్ అంబాసిడర్ హీరో మహేష్: బాబు యోచన?
హైదరాబాద్: సినిమాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న తెలుగు సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన నేపథ్యంలో చంద్రబాబు మహేష్ బాబును ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ మహేష్ బాబును ఒప్పించే బాధ్యతను తీసుకుంటారని కూడా ప్రచారం సాగుతోంది. మహేష్ బాబుకు గల్లా జయదేవ్ బావ అవుతారు. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు కెసిఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.
గుజరాత్కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఢిల్లీకి అక్షయ్ కుమార్, కేరళకు మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. తాజాగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా నియమితులయ్యారు. ఈ స్థితిలో ఈ రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది. శాసనసభ్యుడిగా ఎన్నికైన చంద్రబాబు బావమరిది బాలకృష్ణ కూడా ప్రచారానికి పనికి వస్తారు. మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటే ఆంధ్రప్రదేశ్ దృష్టి మరింత మందిపై పడుతుందని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.
అయితే, మహేష్ బాబు అందుకు అంగీకరిస్తారా అనేది అనుమానమే. గల్లా జయదేవ్కు మహేష్ బాబు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారం చేస్తారని భావించారు. కానీ ఆయన ప్రచారంలోకి దిగలేదు. ట్విట్టర్లో గల్లా జయదేవ్కు మద్దతు తెలిపి సరిపెట్టేశారు. పైగా, ఆయనకు రాజకీయాలు పడవు. సినిమాల్లో తిరుగులేని హీరోగా కొనసాగాలంటే రాజకీయాలకు దూరంగానే ఉండాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, ఈ ప్రచారంలో పెద్దగా పట్టు ఉన్నట్లు కనిపించడం లేదు.