రాజధాని: మంత్రులకు బాబు క్లాస్, మీడియాపై ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు మంత్రులకు హితబోధ చేశారు. మంత్రులు రోజుకో అభిప్రాయం వ్యక్తం చేస్తే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, అందరికీ ఉపయోగకరమైన చోటే నూతన రాజధానిని ఏర్పాటు చేస్తామని, కేంద్రంతో చర్చించి రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెబుతున్నారు. రాజధాని పైన భిన్నాభిప్రాయాలు వద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని చంద్రబాబు అన్నారు. కొత్త రాజధాని విజయవాడ, దొనకొండ, విశాఖ... అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. బాధ్యత లేకుండా రాజధానిపై ప్రచారం చేస్తోందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రానిదే ఏమీ చెప్పలేనన్నారు. ఇంత వరకు ఎలాంటి నివేదిక రాలేదన్నారు.
బాబు డైలమాలో ఉన్నారా?
మూడు జోన్లను రాజధానిగా ఏర్పాటు చేయడం ఉత్తమమని, ఒకచోట మొత్తం అభివృద్ధిని కేంద్రీకరిస్తే సమస్యలు తప్పవని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో చంద్రబాబు డైలమాలో పడ్డారని అంటున్నారు. ఈ విషయమై మంత్రులతో చర్చించనున్నారు.
శాసన సభలో... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మాట్లాడుతూ.. ఉద్యోగాలకు సంబంధంచిన ఖాళీల వివరాలను ప్రకటించేటప్పుడు ఎస్సీ, ఎస్టీ ఖాళీలు వివరాలు ప్రకటించడం లేదన్నారు.
బోగస్ కార్డులపై పరిటాల సునీత
డీలర్లందరు తమ వద్ద ఉన్న బోగస్ రేషన్ కార్డులను ప్రభుత్వానికి అందజేయాలని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సూచించారు. అనంతపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షల బోగస్ కార్డులు ఉన్నాయన్నారు. బోగస్ కార్డుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి రూ.వెయ్యి కోట్ల మేర గండిపడుతోందన్నారు. ప్రతి మండల కేంద్రంలో కిరోసిన్ బంకులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.