'రాజధానిపై రెండ్రోజుల్లో బాబు, 164 కోట్ల లెక్క తేలాలి'
చిత్తూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో ప్రకటన చేస్తారని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. రాజధాని కోసం భూసేకరణ పైన ఇప్పటికే తాము కమిటీని నియమించినట్లు చెప్పారు. కాగా, కొత్త రాజధాని విజయవాడ పరిసరాల్లోనే అని అందరు భావిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో రూ.164 కోట్లకు లెక్కలు తేలాలని యనమల అన్నారు. దీని పైన కమిటీ వేసి లెక్కలు తేల్చాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో లెక్కలు తేలాలని యనమల అన్నారు.
ఆధార్ లింక్
ఆధార్తో పట్టాదారు పాస్బుక్లను అనుసంధానం చేయాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రెవెన్యూ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో ఇ-పాస్ బుక్లను జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ, ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలు సేకరించాలని కూడా రెవెన్యూ శాఖను ఆదేశించారు.
బెల్టు షాపులపై కొల్లు రవీంద్ర
అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులపై 2,300 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 2,197 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా నడిచే బెల్టు షాఫుల నుంచి 8,291 లీటర్ల మద్యం, రెండువేల లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్టు షాపుల నిరోధానికి 29 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, అలాగే ఐదు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు పని చేస్తున్నాయన్నారు.