వద్దే వద్దు!: చంద్రబాబు, ముందే అప్రమత్తమైన బిజెపి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్కు పొత్తు రద్దుపై స్పష్టం చేయనున్నారు. సీమాంధ్రలో టిడిపి, బిజెపి పొత్తు రద్దుపై చంద్రబాబు కృష్ణా జిల్లాలో అధికారిక ప్రకటన చేయనున్నారట.
బిజెపి, టిడిపి కటీఫ్ నేపథ్యంలో సీమాంధ్రలో ఆ రెండు పార్టీలు ఇక ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. పొత్తుపై ఊగిసలాట నేపథ్యంలో బిజెపి తమ పార్టీ అభ్యర్థులను, ఆశావహులను గురువారమే అప్రమత్తం చేసింది. దీంతో బిజెపి కూడా ఒంటరిగా పోటీకి సిద్ధమయిందని అర్థమవుతోంది.
కాగా, విజయనగరం జిల్లా గజపతినగరంలో గురువారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ బిజెపితో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ బలహీనమైన అభ్యర్థులను బరిలో దించడం వల్ల ప్రత్యర్థి పార్టీలు లాభపడి, టిడిపి ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బిజెపి అభ్యర్థులను చూస్తుంటే భయమేస్తోందన్నారు.
ఇరుపార్టీల మధ్య పొత్తులో భాగంగా సీమాంధ్రలో బిజెపికి 4 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. నామినేషన్ వేసేందుకు మరొక్క రోజు గడువు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో పొత్తుపై పునరాలోచన చేయాలని చంద్రబాబు పేర్కొనడం ఆసక్తిని కలిగిస్తోంది.