తప్పుకుంటే మంచిది: బాబు, వీరికి ఇంత మాఫీ చేస్తాం..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రుణమాఫీ, ఎంసెట్ కౌన్సెలింగ్, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల, విద్యుత్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, నామినేటెడ్ పోస్టులు తదితర అంశాల పైన స్పందించారు. ఉదయం కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలోని నిర్ణయాల పైన ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు.
రుణమాఫీ పైన కోటయ్య కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. రుణమాఫీకి రూ.37,900 కోట్లు అవసరమవుతుందన్నారు. రుణమాఫీలో అక్రమాలు జరగకుండా కోటయ్య కమిటీ సూచనలు చేసిందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర మాఫీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రుణాలు చెల్లించిన వారికి, చెల్లించని వారికి ఈ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.లక్ష చొప్పున మాఫీ ఉంటుందన్నారు.
రుణమాఫీతో 87 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నిబంధనల మేరకు లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు. బాధలో ఉన్న రైతులు ఆనందంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. రుణమాఫీ ఏడేళ్లలో తిరిగి చెల్లిస్తామని కోరామని, ఆర్బీఐ నుండి ఇంకా అనుమతి రాలేదన్నారు. చేనేత కార్మికుల రుణాలు కూడా మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 96 శాతం మందికి నూరు శాతం లబ్ధి చేకూరుతుందన్నారు. రుణమాఫీకి కటాఫ్ డేట్ 2014 మార్చి అన్నారు.
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతాం
అందరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. రుణమాఫీ సహా, పలు హామీల పైన మాట ఇచ్చాం కాబట్టి, నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిని తీసుకు వస్తున్నామన్నారు. ఇరవై లీటర్లనీటిని రెండు రూపాయలకే ఇస్తామన్నారు. సమస్యలు ఉన్నా చక్కదిద్దుతామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో 16వేల కోట్ల లోటు ఉందన్నారు.
ధరల పెరుగుదల నియంత్రించాలి, విద్యుత్ ఉత్పత్తి పెంచుతాం
ధరల పెరుగుదలను నియంత్రించాల్సి ఉందన్నారు. టమాటా, ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తామన్నారు. పదివేల మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనాలని నిర్ణయించామన్నారు. కాకినాడలో ఎల్ఎన్జీ నిర్మాణానికి అనుమతిచ్చామన్నారు. ఎల్ఎన్జీ నిర్మాణంతో ప్రభుత్వానికి మూడువేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు.
విద్యుత్ పైన..
నిరంతర విద్యుత్ పైన కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. భవిష్యత్తులో నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. విద్యుత్ సరఫరా పైన రోజు సమీక్ష చేస్తున్నామన్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన...
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. స్థానికతను నిర్ణయించేది తెలంగాణ ప్రభుత్వం కాదని, దానికి చట్టాలున్నాయన్నారు. ఆర్డికల్ 371 డీ ప్రకారం స్థానికత నిర్ణయిస్తారన్నారు.
నామినేట్ పోస్టుల పైన...
కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నామినేట్ పోస్టుల్లో ఉన్న వారు వారంతట వారే రాజీనామా చేయాలన్నారు. అది వారికి గౌరవంగా ఉంటుందన్నారు. వారంత వారే తప్పుకుంటే మంచిదన్నారు. దీనిపై ఆలోచన చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ వల్ల..
కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల లక్షకోట్ల రూపాయల అప్పు సమైక్య ఆంధ్రప్రదేశ్కు వచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చక్కదిద్దుతామన్నారు.