ఇఫ్తార్: జగన్కు బాబు నమస్తే, కేసిఆర్ డుమ్మా, జానా..
హైదరాబాద్: రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ బుధవారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరు కాలేదు. ఇఫ్తార్ విందుకు హాజరైన చంద్రబాబు, జగన్లు పరస్పరం నమస్కారం చేసుకున్నారు.
ఇఫ్తార్ విందుకు గవర్నర్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకూ ఆహ్వానం అందింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్శింహా రెడ్డి, ఈటెల రాజేందర్ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. టి కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు హాజరయ్యారు.
ఇరు రాష్ట్రాల డీజీపీలు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల స్పీకర్లు కోడెల శివప్రసాద్, స్వామిగౌడ్, టీ మండలి చైర్మన్ చక్రపాణిలు హాజరయ్యారు. ఇఫ్తార్ విందుకు హాజరైన నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
జగన్ను పరామర్శించిన జానా
విందుకు హాజరైన జగన్ను తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత జానా రెడ్డి పలకరించారు. అమ్మ బాగుందా అని జగన్ను అడిగారు. అందుకు జగన్ బాగానే ఉన్నారని సమాధానం చెప్పారు.