గ్రేడ్స్: బాబు పరీక్ష, ఇద్దరు మంత్రులే పర్వాలేదట!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్రేడ్లు ఇచ్చేశారా? అంటే అవునంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదేశించడంతో పాటు.. గ్రేడ్లు కూడా ఇస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే బాబు గ్రేడ్లు ఇచ్చేశారట.
అయితే, చంద్రబాబు కేబినెట్లో ఇద్దరు మంత్రులు మాత్రమే అంతో ఇంతో ఆయన మన్నన పొందగలిగారట. మిగతా వారందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారట. రెండు నెలల పూర్తవగానే మంత్రులందరూ ఈ రెండు నెలల్లో ఏయే పనులు, ఎలా చేశారో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మంత్రులు తమ నివేదికను సమర్పించారు. దీంతో సరిపెట్టుకోకుండా మంత్రుల పని తీరుపై తన సొంత టీంతో నివేదికలు తెప్పించుకున్నారట. ఈ రెండు నివేదికలు సరిచూసుకున్నారట.
ఇద్దరు మంత్రులు మాత్రమే కొంతలో కొంత బెట్టర్ అనిపించుకున్నారట. పదిహేడు మంది మంత్రులు చంద్రబాబు మన్నన పొందలేకపోయారట. మంత్రుల పనీ తీరుతో పాటు ఎమ్మేల్యేల పని తీరుపై కూడా ఆయన సమీక్షించారు. ఎమ్మెల్యేల పని తీరు కూడా ఆయనకు ఆశాజనకంగా కనిపించలేదట. ఇలా ఉంటే కష్టమని వారికి చెప్పేశారట.