విభజన జరిగిన 2 నెలల్లో: బాబు, గుర్రమెక్కిన మంత్రి
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన రెండు నెలల్లోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేయగలిగామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. విజయవాడలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో విద్యుత్ రంగంలో రెండు మిలియన్ యూనిట్ల లోటు ఉండేదన్నారు. విద్యుత్ రంగంలో లోటు ఇప్పుడు జీరో స్థాయికి వచ్చిందని చెప్పారు.
జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే పాలనను కొనసాగించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. బుధవారం నగరంలో మంత్రులు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈనెల 12న సింగపూర్ బృందం రాష్ర్టానికి మరోసారి వస్తోందని, రాజధానికి మాస్టర్ప్లాన్ తయారు చేస్తుందన్నారు.
ఏపీలో వంద శాతం ఆధార్ అకౌంట్ ఉండాలని, అన్ని పథకాలను ఆధార్కు అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. రుణాలు రీషెడ్యూల్ వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. రుణాలు రీషెడ్యూల్పై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
భూసమీకరణకు ముందుకు వచ్చిన రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. భూ సమీకరణలో మనదే మెరుగైన పాలసీ అన్నారు. తాత్కాలిక రాజధాని కోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని అన్ని ఆఫీస్లను ఇక్కడి నుంచే నిర్వహించాలని తెలిపారు.
ఈనెల 14,15,16 తేదీల్లో సంక్రాంతి సెలవులుగా సీఎం ప్రకటించారు. సంక్రాంతి సరుకులు అందరికీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దన్నారు. రెండో విడత రుణమాఫీలో రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అద్భుత రాజధాని: నారాయణ
నవ్యాంధ్రకు అద్భుత రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణంపై సింగపూర్ కార్మిక, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్ ఆధ్వర్యంలో డిజైన్ జరుగుతోందని, ఈ నెల 13న చంద్రబాబుతో కలిసి ఆయన ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారన్నారు.
జూన్లోగా డిజైన్ పూర్తి అవుతుందని తెలిపారు. తుళ్లూరు మండలం దొండపాడు, అబ్బరాజుపాలెం, ఐనవోలు, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో మంగళవారం జరిగిన భూ సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూములు ఇవ్వడానికి తమ అంగీకారం తెలియచేస్తూ ఆయా ప్రాంత రైతులు మంత్రికి పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. నూతన రాజధానిని కాలుష్య రహితంగా, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. కాగా, వెలగపూడి గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను గ్రామస్తులు గుర్రం ఎక్కించి ఊరేగించారు. ఐనవోలు గ్రామంలో మంత్రిని గజమాలతో సత్కరించారు.