నన్ను చూసే మోడీ అభివృద్ధి చేశారు: చంద్రబాబు
మచిలీపట్నం: అవినీతి పునాదుల మీద ఏర్పడిన వైయస్సార్ కాంగ్రెసు అధికారంలోకి వస్తే చంచల్గూడ జైలులో సచివాలయాన్ని నిర్మిస్తాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని దుమ్మెత్తిపోశారు. వ్యవసాయం, వ్యాపారం లేకుండానే జగన్కు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
సిబిఐ దర్యాప్తులో 43వేల కోట్ల రూపాయలపై చార్జ్షీట్లు వేశాయన్నారు. 1100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేశారన్నారు. ఇంత అవినీతి మరకలున్న వైఎస్ఆర్ కాంగ్రెసు నాయకులు విలువల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కేసుల మాఫీ కోసమే దోచుకున్న డబ్బుతో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.
ప్రజల కోసం పని చేయాల్సిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి రోబోగా మారారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి దేశాన్ని పరిపాలించే శక్తి లేదన్నారు. పది ఎంపి స్థానాల కోసం రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి తెలుగుజాతి ఔన్నత్యాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. శుక్రవారం ఆయన మచిలీపట్నం, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు.
దేశ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా మత సామరస్యానికి ఎలాంటి విఘాతం కలగనివ్వనన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్లకు పాతరేసి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించాలని కోరారు. తన తొమ్మిది సంవత్సరాల పరిపాలన అభివృద్ధికి అడ్రస్గా నిలిచిందన్నారు. 1995లో తాను రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూసి 2002లో గుజరాత్ను మోడీ అభివృద్ధి చేశారన్నారు. ఎన్డీఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా మైనార్టీలకు అన్యాయం జరగనివ్వలేదన్నారు.
చంద్రబాబు రోడ్ షో
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు.
జగన్పై నిప్పులు చెరిగిన బాబు
మచిలీపట్నం రోడ్ షోలో చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై నిప్పులు చెరిగారు.
జైలు గోడల మధ్యే సచివాలయం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు అధికారం ఇస్తే జగన్ చంచల్గుడా జైలులోనే సచివాలయాన్ని నిర్మిస్తాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తండ్రిని అడ్డం పెట్టుకుని...
వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.
సోనియా గాంధీకి రోబోగా..
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రోబోగా మారారని చంద్రబాబు మచిలీపట్నం రోడ్ షోలో వ్యాఖ్యానించారు.
బిజెపితో పొత్తు పెట్టుకున్నా...
బిజెపి పొత్తు పెట్టుకున్నా మతసామరస్యానికి విఘాతం కలగకుండా చూస్తామని చంద్రబాబు మచిలీపట్నం రోడ్షోలో హామీ ఇచ్చారు.
నన్ను చూసే మోడీ..
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని చూసే నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చంద్రబాబు చెప్పుకున్నారు.
నేనే అభివృద్ధి చేస్తా..
సీమాంధ్రను తాను అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు మచిలీపట్నంలో హామీ ఇచ్చారు.