టీ విందు: పవన్ ఇంటికి చంద్రబాబు, హరిపై బాలకృష్ణ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించారు. పవన్ ఆహ్వానంతో చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమావేశంలో వారు భవిష్యత్తు కార్యాచరణ, ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎడమొఖం పెడముఖంగా ఉన్నట్లుగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీ చర్చకు దారి తీసింది.
టిడిపిలోకి చెన్నకేశవులు
అనంతపురం జిల్లా ఉరవకొండ కాంగ్రెస్ నేత చెన్నకేశవులు టిడిపిలో చేరారు. ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
హరిని అడగలేదు: బాలకృష్ణ
తన తరపున ప్రచారం చేయాలని తన సోదరుడు హరికృష్ణను అడగలేదని హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ వేరుగా చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ను కూడా ప్రచారానికి రమ్మని ప్రత్యేకించి ఆహ్వానించలేదన్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రచారానికి రావాల్సిందిగా తానెవ్వరినీ కోరలేదన్నారు. పార్టీ కోసమే కొందరికి టిక్కెట్లు ఇవ్వలేదని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. రెండుప్రాంతాల్లో అభివృద్ధి తమ ధ్యేయమన్నారు. హిందూపురం టిడిపి కంచుకోట అని, భారీ ఆధిక్యంతో గెలుస్తానని చెప్పారు.
నామినేషన్ ఉపసంహరించుకున్న వెంకటరమణ
కృష్ణా జిల్లా కైకలూరు టిడిపి రెబల్ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సీమాంధ్రలో నామినేషన్ ఉపసంహరణకు నేడు చివరిరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.