15 సలహాలు, బాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: డిగ్గీ, చిరంజీవి గైర్హాజరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం పైన సలహాలను ఫిబ్రవరి 15వ తేదీన తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రూపు సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పార్టీలో బలోపేతం పైన సలహాలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు. పీసీసీ మార్పు పైన ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎన్నికల హామీలను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గలేదని మండిపడ్డారు. ఫ్యూయల్ పైన వ్యాట్, ఎక్సైజ్ పన్నులు పెంచి వినియోగదారులపై భారం మోపిందన్నారు. కాంగ్రెస్ పటిష్టత కోసం సాగే చర్చలు ఫిబ్రవరి వరకు సాగుతాయన్నారు.
కాగా, గురువారం దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఇందిరా భావన్లో ఆంధ్రప్రదేశ్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారని సమాచారం. మాజీ కేంద్రమంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సాయిప్రతాప్, మాజీ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాలేదని తెలుస్తోంది.
దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల పైన, తిరుపతి ఉప ఎన్నిక, పరిపాలన పైన చర్చించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం పైన ఒత్తిడి తేవాలన్నారు.
గాంధీ ఆసుపత్రిలో దత్తాత్రేయ తనిఖీలు
గాంధీ ఆసుపత్రిలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గురువారం తనిఖీలు జరిపారు. స్వైన్ఫ్లూ విస్తరిస్తుండటంతోపాటు పలువురు మరణిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి దత్తన్న ఆసుపత్రిలో పర్యటించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.