హోలీ: డప్పు కొట్టిన బాబు, స్వీట్లు పంచిన సోనియా
హైదరాబాద్/ న్యూఢిల్లీ: హోలీ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్లో డప్పు కొట్టి ఉత్సాహం ప్రదర్శించగా, ఢిల్లీలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వీట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి నిజమైన హోలీ పండుగను జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తన నివాసంలో సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య చంద్రబాబు డప్పు కొట్టి అందరిని అబ్బురపరిచారు.
హోలీ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆనందాన్ని పంచుకోడానికి హోలీ జరుపుకుంటామని ఆయన మీడియాతో అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో హోలీ కూడా సంతోషంగా జరుపుకునే పరిస్థితిలో లేదని ఆయన అన్నారు. ఒక వైపు పేదరికం, మరోవైపు ధరల పెరుగుదల, ఇంకోవైపు నిరుద్యోగం వీటన్నిటితో ప్రజలు సతమతమవుతున్నారని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు.
ఈరోజు హోలీ జరుపుకుందామని, గడిచిన కష్టాల్ని మరిచిపోదామని, పెరిగిన ఇబ్బందులు మరిచిపోదామని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాలని, అప్పుడే నిజమైన హోలీ అవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సోనియా సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, సోనియా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నేతలు మోతీలాల్ ఓరా, అజిత్ జోగి సహా అనేక మంది కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలకు సోనియాగాంధీ మిఠాయిలు పంచిపెట్టారు.