అత్యాశవద్దు: ల్యాండ్ పూలింగ్పై చంద్రబాబు హెచ్చరిక
హైదరాబాద్: భూమి యజమానులు మరీ అత్యాశకు పోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన విజయవాడలో మాట్లాడారు. ల్యాండ్ పూలింగుకు రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చట్టం ద్వారా భూములను సేకరిస్తామని చెప్పారు.
ల్యాండ్ పూలింగుకు రైతులు ముందుకు రాకుంటే వారే నష్టపోతారన్నారు. భూమి ఉన్న యజమానులు అత్యాశకు పోవద్దని హితవు పలికారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలనుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. విజయవాడ పరిసరాల్లో భూములు బంగారు బాతుల్లా తయారయ్యాయని అన్నారు.
రైతులకు బాబు దీపావళి కానుక
రాష్ట్ర రైతులకు చంద్రబాబు దీపావళి కానుక ఇచ్చారు. పండుగ ముందు రోజు 20 శాతం రుణాలు చెల్లిస్తామని చెప్పారు. రైతు సాధికారిక కమిటీ ద్వారా నగదును బ్యాంక్లో వేస్తామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేలా అన్నీ చర్యలు తీసుకుంటామన్నారు. దశలవారీగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. విజయవాడలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
పంట రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రూ. లక్షా 50 వేలు ఇచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని చేయాలని ముందుకు వస్తున్నామని చెప్పారు. ఈనెల 22న రైతులకు అందజేయాలని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఏ బ్యాంక్ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆ రుణాలు రీ షెడ్యూల్ చేసి 20 శాతం కాకుండా ఇంకా ఎక్కువ రుణం ఇచ్చేలా బ్యాంకులను కోరతామని ఆయన తెలిపారు.
మిగిలిన 80 శాతం నాలుగేళ్లలో రైతులకు పూర్తిగా డబ్బు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు రుణ మాఫీ కాదు.. రుణ విముక్తులను చేస్తున్నామన్నారు. అలాగే డ్వాక్రా సంఘాలకు రూ.7,600కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఆడబిడ్డ లక్షాధికారి కావాలని, పేదరికంపై మహిళ గెలుపు సాధించాలన్నారు. పాదయాత్ర సమయంలో వృద్ధుల కష్టాలను చూశానని పెద్ద కొడుకుగా వృద్ధులు, వితంతువులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
విద్యుత్ పొదుపు కోసం రూ.10లకే ఎల్ఈడీ బల్బులు సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటలూ కరెంట్ సరఫరా చేస్తామన్నారు. విజయవాడలో అన్ని వాహనాలకు సీఎన్జీ అందజేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రూ.2.50 లక్షలతో వైద్యం అందజేయనున్నట్లు వెల్లడించారు. టీడీపీ తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఉద్యమంలా చేయాలని పిలుపు ఇచ్చారు. చెక్డ్యామంలలో వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలని, అవకాశమిస్తే ప్రపంచాన్నే జయిస్తారని, వృత్తి నైపుణ్యంతోనే ఉత్పాదకత పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలు తిరిగి భారత్ ప్రతిష్టను పెంచారని చంద్రబాబు కొనియాడారు. అమెరికాలో మోడీకి అరుదైన గౌరవం దక్కిందని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2లకే 20 లీటర్ల మంచినీరు అందనుంది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రజలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ ఆంధ్రప్రదేశ్కు ఆదర్శంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అపరిశుభ్రతతోనే ఆరోగ్య సమస్యలు వస్తాయని, బహిరంగ బహిర్భూమి ఆరోగ్యానికి హానికరమని ఆయన అన్నారు.